క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సినిమాలు అర్ధం చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదన్న విషయాన్ని “1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో” సినిమాలు రుజువు చేసాయి. అయితే ఇదే సమయంలో సుకుమార్ సినిమాలు అర్ధమైతే ఎంత అద్భుతంగా ఉంటాయో కూడా ఈ రెండు సినిమాలు నిరూపించాయి. అందుకే ఈ రెండు సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సారి సినిమాలో కాకుండా ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకపై ఓ ‘పజిల్’ విసిరాడు.
‘నాన్నకు ప్రేమతో’ సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమా మొదలుపెట్టని సుకుమార్, తన తదుపరి సినిమా గురించి ఓ ప్రకటన చేసాడు. అయితే ఇందులో సుకుమార్ ఇచ్చిన సస్పెన్స్ ఏంటంటే… హీరో పేరు చెప్పకుండా నిర్మాతల పేర్లు మాత్రమే చెప్పాడు. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ సినిమాలను తెరకెక్కించిన మైత్రీ మూవీస్ సంస్థలో తన తదుపరి సినిమా ఉండబోతోందని సుకుమార్ ప్రకటించారు.
అయితే మరి సుక్కూ దర్శకత్వంలో నటించే హీరో ఎవరు? అన్న ప్రశ్నకు ‘మెగా వారసుడు రామ్ చరణ్’ అన్న సమాధానం వస్తోంది. చెర్రీతో ఓ సినిమా ఉండబోతోందని గతంలో సుకుమార్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సుక్కూ – చెర్రీల కాంభినేషన్ లో మైత్రీ మూవీస్ ఓ సినిమా నిర్మిస్తోందని ఖరారైందన్న టాక్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ సంస్థ చేతిలో పవన్ కళ్యాణ్, మహేష్ ల డేట్స్ కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్న సమాచారంతో సుక్కూ ప్రకటన ఆసక్తికరంగా మారింది. మరి ఈ పజిల్ ని సుక్కూ ఎప్పుడూ రివీల్ చేస్తాడో..?