ఏపీకి కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న ‘ప్రత్యేక ప్యాకేజీ’ పేరు మారింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్ లతో తన అధికారిక నివాసంలో భేటీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి కీలక విషయాలను వెల్లడించారు. ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ పేరును ‘స్సెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ’గా పేర్కొన్నారు. దీని కింద ఇచ్చే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద అందే నిధుల కంటే అధికంగా ఉంటాయని కూడా హామీ ఇచ్చారు. అలాగే నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం భాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని పేర్కొన్నారు.
అయితే ఇక్కడున్న ట్విస్ట్ ఏమిటంటే… ఈ ‘స్పెషన్ డెవలప్ మెంట్ ప్యాకేజీ’లో రాజధానికిచ్చే నిధుల ప్రస్తావన ఉండబోదని కూడా తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మించనున్న భవనాల డీపీఆర్ లు అందజేసిన తర్వాత మాత్రమే సదరు నిధులను మంజూరు చేస్తామని, రాజధానిలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాల నిర్మాణ బాధ్యతలన్నీ తామే తీసుకుంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కూడా ఆయన సుజనా, రమేశ్ లకు హామీ ఇవ్వడం విశేషం.