వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ పదవిలో ఉన్న సీనియర్ రాజకీయ వేత్త కొణిజేటి రోశయ్య మనవడు అనిరుధ్ వివాహం ఆదివారం నాడు హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వైభోవపేతంగా జరిగింది. బొమిడాల రామకృష్ణ, అనితల కుమార్తె లక్ష్మీ ప్రదీప్తితో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన రాజకీయ, సినీ ప్రముఖుల నడుమ ఓ ఆసక్తికర దృశ్యం దర్శనమిచ్చింది. వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న సందర్భంగా ఒకే సమయంలో బయలుదేరిన కేసీఆర్ మరియు దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే ఈ దృశ్యం పలకరింపు వరకే పరిమితమైతే, వార్తలకు పెద్దగా ప్రాధాన్యత దక్కేది కాదు.
పలకరింపులతో ఆగని కేసీఆర్ – కేవీపీలు ఒకరి చెవిలో మరొకరు ఏదో విషయం చెబుతూ గుసగుసలాడుకున్న దృశ్యం అక్కడకు విచ్చేసిన ప్రముఖులను ఆకర్షించింది. ఆసక్తిగా మారిన వీరిద్దరి గుసగుసల ఆంతర్యం ఏమిటో ఆ “జగన్నాధుడి”కే తెలియాలి అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. అవునులేండి… చక్రం తిప్పేవారికే కదా అది ఎలా తిరుగుతుందో తెలిసేది..!