ప్రతి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలను చూసి, నచ్చితే నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం దర్శకధీరుడు రాజమౌళికి పరిపాటే. అలాగే ఈ శుక్రవారం కూడా ‘శ్రీరస్తు శుభమస్తు, మనమంతా’ సినిమాలు విడుదలయ్యాయి. మెగా హీరో అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాను పక్కన పెట్టి, ‘మనమంతా’ సినిమాకు వెళ్ళిన రాజమౌళి, ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
వారాహి చలన చిత్ర సంస్థ నిర్మించిన సినిమాలలో మరియు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమాలలో “మనమంతా” అనేది టాప్ క్లాస్ సినిమాగా నిలుస్తుందని, నటీనటుల నుండి అద్భుతమైన అభినయాలను రాబట్టడంలో చందు నైపుణ్యత గలవాడని, సూపర్ స్టార్ మోహన్ లాల్ నుండి నాలుగు సంవత్సరాల పిల్ల వరకు అద్భుతంగా నటించారని కితాబిచ్చారు.
‘మనమంతా’ సినిమా చాలాకాలం పాటు మదిలో నిలిచిపోతుందని, ఒక పుస్తకం మాదిరి ఎలా ప్రారంభమైందో అలాగే ముగిసిందని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ… తామూ ‘మనమంతా’ సినిమాకు పని చేసామని గర్వంగా చెప్పుకోవచ్చని… రాజమౌళి చేసిన వ్యాఖ్యలు “మనమంతా” చిత్ర యూనిట్ కు మాంచి ఉత్సాహం ఇచ్చి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.