“శ్రీనివాస కళ్యాణం” అన్న పేరు పేరుతో ఈ నెల 9వ తేదీన నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలయ్యింది. సినిమా అంతా పెళ్లి యొక్క గొప్పతనం గురించి చెప్పేటట్లుగా ఉందని ఈ ట్రైలర్ స్పష్టం చేసింది.
దిల్ రాజు ఫ్యామిలీ సినిమాలలో సహజంగా ఉండే జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి నటులతో సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉండగా, నితిన్ – రాశి ఖన్నాల జంట చూడముచ్చటగా ఉంది. అలాగే మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినసొంపుగా ఉంది. మొత్తమ్మీద ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చిత్ర యూనిట్ అందిస్తున్నట్లుగా కనపడుతోంది.
అయితే సినిమా అంతా ఒక్క పెళ్లి గురించే ఉంటుందా? లేక పెళ్లి చుట్టూ కధను అల్లుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ ఇదే పెళ్లి కాన్సెప్ట్ తో “వరుడు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తీవ్రంగా తిరస్కరింపబడ్డ విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.