పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును యువ శ్రీలంక మట్టికరిపించి మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగవ ఇన్నింగ్స్ లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు, కేవలం 161 పరుగులకే కుప్పకూలడంతో, 106 పరుగుల భారీ విజయంతో శ్రీలంక విజయం సొంతం చేసుకుంది. 5 వికెట్లతో స్పిన్నర్ హెరత్ సత్తా చాటగా, కెప్టెన్ స్మిత్ 55 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆసీస్ 203 పరుగులు చేసి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఒకానొక దశలో రెండవ ఇన్నింగ్స్ లో కూడా కష్టాల బారిన పడిన శ్రీలంక జట్టును మెండిస్ ఆదుకున్నాడు. 176 పరుగులతో సత్తా చాటడంతో, రెండవ ఇన్నింగ్స్ లో 353 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. దీంతో 268 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది.
ఇన్నింగ్స్ రెండవ ఓవర్ నుండే ప్రారంభమైన వికెట్ల పతనం నిరంతరంగా కొనసాగింది. అయితే 56.1 ఓవర్లో 157 పరుగుల వద్ద పతనమైన 7వ వికెట్ అనంతరం, టెస్ట్ మ్యాచ్ రుచి ఏమిటో చూపించారు ఆసీస్ టైల్ ఎండర్స్. దాదాపు 30 ఓవర్ల పాటు సాగిన నెవిల్ – కీఫే జోడి కేవలం 4 పరుగులు మాత్రమే సాధించింది. అది కూడా ఒకే ఒక బౌండరీ మాత్రమే. చివరగా 85.5వ ఓవర్లో ఈ జోడికి బ్రేక్ రాగా, మరో మూడు ఓవర్ల అనంతరం చివరి వికెట్ కూడా పతనమైంది. దీంతో మ్యాచ్ లంక వశమవ్వగా, భంగపాటుకు గురికావడం ఆసీస్ వంతయ్యింది.