వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలలో కనపరిచిన శ్రద్ధ, పధకాల అమలు మీద చూపిస్తే సామాన్య ప్రజానీకానికి మేలు జరుగుతుంది. “జగన్ చేసేది గోరంత… చెప్పేది కొండంత” అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి టీడీపీ నేతలు విమర్శలు గుపిస్తున్నారు.
తన నియోజకవర్గం సమస్యల మీద కన్నా, ప్రతిపక్ష నేతల మీద విమర్శలకు., తమ పార్టీ చేసే విషప్రచారాలను ప్రజలపై రుద్దడంలో ఎక్కువ సమయం వెచ్చించే విజయసాయిరెడ్డి తాజాగా ప్రభుత్వ పని తీరుని ఉద్దేశించి ఒక పత్రికా ప్రకటనను చేశారు. ఇప్పుడు ఇదే టీడీపీ ఒక అవకాశంగా మలచుకొని వైసీపీ మీద సోషల్ మీడియా వార్ చేస్తోంది.
ఎగుమతుల్లో ఎగువన ఏపీ., గుజరాత్ తరువాత మనమే., ఎగుమతుల వృద్ధిలో రెండో స్థానంలో ఏపీ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఒక పత్రికా ప్రకటన సర్క్యూలేట్ అవుతోంది. ఇప్పుడు ఇదే పోస్టును టీడీపీ సోషల్ మీడియా మరో విధంగా వైరల్ చేస్తుంది.
గంజాయి., ఎర్రచందనం., డ్రగ్స్., రేషన్ బియ్యం ఎగుమతులలో ఎవ్వరు ఎక్కలేనంత ఎగువన ఏపీని ఉంచిన ఏ1., ఏ 2 రెడ్డి గార్ల కృషి అనన్య సామాన్యం., అంటూ టీడీపీ ముఖ్య నేత అయ్యన్న పాత్రుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంజాయి., చందనం ఎగుమతులతో నెంబర్ 1 స్థానంలో., డ్రగ్స్., రేషన్ బియ్యం ఎగుమతులతో నెంబర్ 2లోనూ అంటూ తమకు అలవాటైన 1, 2 నెంబర్లను వీసా రెడ్డి వదలేకపోతున్నారు అంటూ టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ పని తీరుని., జగన్ పాలనా వ్యవస్థను చూసిన ప్రజలు ఏపీ ఎగుమతులలో మరో ఘట్టాన్ని చేర్చారు అదే “వలసలు” అంటూ చమత్కరించారు. ఏపీలో ఉన్న ఆర్ధిక సంక్షోభంతో ఇక్కడి ప్రజలు పక్క రాష్ట్రాలకు ఎగుమతి అయిపోతున్నారు. ఈ ఎగుమతిలో కూడా ఏపీని మొదటి స్థానంలో ఉంచిన ఘనత జగన్ దే అంటూ వైసీపీ విధాన నిర్ణయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘ఎగుమతులతో ఎగువున ఏపీ’ అంటూ సగర్వంగా ప్రకటనలు చేసిన విజయ సాయిరెడ్డి, ఆ ఎగుమతులు ఏమిటో అంటే ‘ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు’ అని చెప్పడమే ఇందులో కొసమెరుపు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని నేటి యువతరాన్ని ఇటువంటి అక్రమదారులలోకి వెళ్ళకుండా., చెడు అలవాట్లకు బానిసలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అంటూ ప్రజలకు టీడీపీ నాయకులు హిత బోధనాలు చేస్తున్నారు.