trolls on Vijaya- Sai -Reddyట్విట్టర్‌లో చురుకుగా ఉండే రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి.. విపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటారు. టీడీపీ, జనసేనపై ఆయన చేసే ట్వీట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. చాలా సార్లు ఆ ట్వీట్లు శృతి మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనే ట్రోల్ అవుతున్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. ‘‘ఈసారి 151 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 225 స్థానాలకుగానూ 224 స్థానాల్లో గెలిపించాలి’’ అని కోరారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో ఉన్నది 175 స్థానాలే కదా…. 225 ఎక్కడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మీరు రాజ్యసభ సభ్యుడు కొంచెం అప్డేట్ గా ఉండండి అంటూ చురకలు అంటిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మాత్రం దానిని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ సీట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని అందుకే విజయ సాయి రెడ్డి అలా అన్నారని అంటున్నారు. అయితే కేంద్రం ఇప్పటికే అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇప్పట్లో జరగదని తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికలు కూడా 175 సీట్లలోనే జరగబోతున్నాయి.