మరీ జగన్ ను అలా ఆడుకోకండయ్యా!కనిపించిన ప్రతి ఒక్కరికీ పది వేలు అన్న స్థాయిలో హామీలను గుప్పించి, వాటిని అమలు చేయలేక తిమ్మినిబమ్మిని చేస్తూ రోజులు నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దయనీయ పరిస్థితిని అర్ధం చేసుకునే స్థితిలో నెటిజన్లు లేరనుకుంటా! అందుకే ఏ చిన్న అవకాశం చిక్కినా జగన్ ను ఒక ఆట ఆడుకుంటూ సందడి చేస్తున్నారు.

అమిత్ షా పర్యటన సందర్భంగా ప్రత్యేకమైన విమానంలో తాడేపల్లి నుండి తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, శనివారం నాడు రాత్రికి మళ్ళీ అదే ప్రత్యేకమైన విమానంలో తాడేపల్లికి తిరుగుముఖం పట్టారు. అలాగే ఆదివారం నాడు వేకువజామునే అదే ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లి అమిత్ షాతో సహా శ్రీవారి దర్శనం చేసుకుని, 29వ సదరన్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యారు.

కేవలం కొద్ది గంటల సమయానికి తాడేపల్లి నుండి తిరుపతికి రెండు సార్లు తిరగడం బహుశా జగన్ వంటి ఒక పేద ముఖ్యమంత్రి మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు చేస్తోన్న ట్రోల్స్ కోకొల్లలు. ఆర్టీసీ బస్ మాదిరి అప్ డౌన్ చేయడం ఆర్ధికంగా భారం కాకుండా చూడడం కోసమేనని… తిరుపతిలో హోటల్ రూమ్ కు చార్జీలు చెల్లించలేక తాడేపల్లి వచ్చేసారని… ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా ఆడుకోవడం నెటిజన్ల వంతయ్యింది.

ఇచ్చిన హామీల కోసం క్షణం తీరిక లేకుండా అహర్నిశలు కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులను మరీ అలా ట్రోల్ చేయకండయ్యా… అంటూ వ్యంగంగా హితవు పలకడం రాజకీయ విశ్లేషకుల వంతు!