Social Media - Ram Charan Shootingతమ మొదటి సినిమా ప్రిన్స్ మహేష్ బాబు మొదలుకుని, అందరి టాప్ హీరోల డేట్స్ ను సంపాదించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగనుంది. పచ్చని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని, ఇటీవల సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న వర్కింగ్ స్టిల్స్ చెప్పకనే చెప్పాయి.

ఇదే సమయంలో ఈ సినిమా గురించి అనేక సమాచారం హల్చల్ చేసింది. హీరో రామ్ చరణ్ చెవిటి వాడని, హీరోయిన్ సమంత మూగ పాత్రలో నటిస్తోందని… ఇలా పుకార్లు షికారు చేసాయి. అయితే ఏ రకమైన పుకార్లను అభిమానులు నమ్మవద్దని, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సోషల్ మీడియాలో ఉన్న తమ అకౌంట్ల ద్వారా తామే తెలియజేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన చేయడానికి ముందే సుకుమార్ – రామ్ చరణ్ ల సెల్ఫీ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

ఈ సినిమా షెడ్యూల్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొంటుండడం విశేషం. పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఈ దంపతులు తాజాగా భీమవరంలోని మావుళ్ళమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. చెర్రీ ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమాన గణం భారీ సంఖ్యలో గుడికి క్యూలు కట్టారు. గుడి లోపల సైతం చెర్రీ – ఉపాసనలను తమ మొబైల్ కెమెరా కళ్ళల్లో బందించాలని అభిమానులు ఉత్సాహం చూపించారు. కొత్త గెటప్ లో చెర్రీ లుక్ అదిరిపోయిందనే టాక్ ఇప్పటికే సర్వత్రా వినపడుతోంది.