మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ నిలువునా మునిగిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు తోడ్పడిందే తప్ప జగన్ ప్రభుత్వాన్ని దారిన పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏపీ విషయంలో కేంద్రం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది దేనికి సంకేతం?అని ప్రశ్నించుకొంటే రాష్ట్రపతి ఎన్నిక తర్వాత నుంచే కేంద్రం వైఖరిలో మార్పు కనిపిస్తోంది కనుక రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేనల పొత్తులకే అని చూచాయగా అర్దం అవుతుంది. ఆ మార్పు ఏమిటో చూద్దాం.
మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి కట్టకుండా కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు ఈ అంశంపై మౌనం వహించిన కేంద్రం (బిజెపి) ఇప్పుడు అమరావతే రాజధాని అని గట్టిగా నొక్కి చెపుతోంది. నేటికీ జగన్ ప్రభుత్వం అమరావతిని, దాని కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మూడు రాజధానుల పాటే పాడుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం, దానిలో విద్యా సంస్థల ఏర్పాటు, ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ గురించి సమావేశం ఏర్పాటుచేస్తోంది.
ఈ నెల 27న ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావలసిందిగా కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు పంపింది. వాటిలో పేర్కొన్న ఈ అంశాలను గమనిస్తే కేంద్రం వైఖరిలో మార్పు వచ్చిందనే విషయం మరింత స్పష్టంగా కనబడుతుంది.
రెండు రాష్ట్రాలకు సంబందించిన అంశాలు:
· షెడ్యూల్ 9,10లోని సంస్థల ఆస్తులు పంపకాలు
· సింగరేణి కాలరీస్ విభజన
· ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
· ఏపీకి తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలపై చర్చ
ఏపీ రాజధాని అమరావతికి సంబందించిన అంశాలు:
· కొత్త రాజధానికి అంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయసహకారాలు అందించడం
· కొత్త రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ
· కొత్త రాజధానిలో కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు
ఏపీకి సంబందించిన అంశాలు:
· ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం పన్ను ప్రోత్సాహకాలు
· ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయింపు
· రెవెన్యూ లోటు భర్తీ