భారత్ లో నగదురహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందుకోసం ప్రజలకు అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోనులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. భారత్ పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్మార్ట్ ఫోన్ల ధరలు 2000లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ ఫోన్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ… వాటి ధరలను కచ్చితంగా 2,000 కంటే తక్కువగా ఉండేలా మార్కెట్లోకి తీసుకురావాలని స్థానిక హ్యాండ్ సెట్ తయారీదారులను ఆదేశించింది.
స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలకే అందిస్తే డిజిటల్ లావాదేవీలను మరింత సమర్థవంతంగా జరపవచ్చని, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్ లు లభించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ సమావేశం ఫలితంగా మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ రేట్లకే స్మార్ట్ ఫోన్లను అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థలతో పాటు శాంసంగ్, యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనలేదు.
20 నుంచి 25 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందించేలా హ్యాండ్ సెట్ కంపెనీలకు సర్కారు ఆదేశాలు జారీ చేసిందని, అయితే ఆ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని మాత్రం ప్రభుత్వం భావించడం లేదని తెలిపారు. స్మార్ట్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్ వంటి సదుపాయాలను ఇంత తక్కువ ధరకు అందించడం కష్టంతో కూడుకున్న పనేనని సదరు కంపెనీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 జీ స్మార్ట్ ఫోన్లు 2500 రూపాయలకు లభిస్తుండగా, 4 జీ స్మార్ట్ ఫోన్ ధరలు మాత్రం ప్రియంగానే ఉన్నాయి.