ఆదివారం నాడు తన అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘ఖుషీ’ సినిమా దర్శకుడు ఎస్.జే.సూర్య దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్తుందనుకున్న సినిమాకు దర్శకుడు మారిపోయి, ఏకంగా ‘గోపాల గోపాల’ ఫేం డాలీ లైన్ లోకి వచ్చేసిన వార్త ఫ్యాన్స్ కు పెద్ద షాక్ కే గురి చేసింది. ఇప్పటికే రెండు పాటలను రికార్డు చేయించుకోవడం, ‘హుషారు, కడప కింగ్’ వంటి టైటిల్స్ ను కూడా పరిశీలనలోకి తీసుకోవడం వంటి వార్తలు హల్చల్ చేసిన నేపధ్యంలో… త్వరలోనే పట్టాలెక్కనుందని ఇటీవల ‘సూపర్ హిట్’ అధినేత బిఎ రాజు కూడా ట్వీట్ చేసారు.
అయితే దర్శకుడి మార్పుపై అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఎలాంటి పుకార్లకు తావు లేకుండా పోయింది. సూర్యకు నటుడిగా మంచి ఆఫర్లు వస్తున్నందున తేదీలను అడ్జెస్ట్ చేయాల్సిందిగా పవన్ కోరగా, అలా చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ బాగా లేట్ అవుతుందని, ఇద్దరి అవగాహన మేరకు సూర్య తప్పుకున్నారని, ఈ స్థానంలో డాలీని ఎంపిక చేసినట్లుగా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు ‘దర్శకుడు’ అనేది టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకునేందుకే తప్ప, సినిమాపై ఎలాంటి ప్రభావం చూపదని సినీ వర్గాలు చెప్తున్నాయి.
వర్ధమాన దర్శకులకు మాత్రమే పవన్ అవకాశాలు ఇవ్వడం వెనుక ‘మతలబు’ కూడా ఇదేనని చెప్తున్నారు. బాబీని దర్శకుడిగా పెట్టుకుని ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు ఓపెనింగ్ డే రికార్డు రెవిన్యూ రాబట్టడం పవన్ వలనే సాధ్యమైందని, అయినా స్వతహాగా పవనే ఒక దర్శకుడు కావడంతో… ఇతర దర్శకులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే, ఒక్కసారి సినిమా ఒప్పుకున్న తర్వాత ఎస్.జే.సూర్య తప్పుకోవడానికి గల ప్రధాన కారణం ప్రిన్స్ మహేష్ బాబు సినిమానేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సూర్య విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రెస్ నోట్ లో కూడా సూర్యకు నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నందునే పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేయడంతో, మురుగదాస్ – మహేష్ బాబుల సినిమా అవకాశం, పవన్ కళ్యాణ్ సినిమాపై పడినట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఏది ఏం జరిగినా… పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకుని వెళ్ళడమంటే సాధారణ విషయం కాదు కదా..!