mahesh-babu-singer-ushaతెరముందు ఉండే నటీనటులకు, తెరవెనుక ఉండే సాంకేతిక వర్గాలకు పరిచయం కాస్త తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గాయకులకు, హీరోహీరోయిన్లకు మధ్య చాలా తక్కువ అనుబంధం ఉంటుంది. అయితే తనతో మాత్రం అందరూ చాలా మంచిగా ఉన్నారంటూ… ఆ అనుభూతులను చెప్పుకొచ్చింది సింగర్ ఉష. ఒకప్పుడు టాలీవుడ్ నాట బిజీగా వెలిగిన ఈ సింగర్, ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ హీరోలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.

‘ఒకప్పుడు ఫ్లైట్ లో మెగాస్టార్ చిరంజీవి కలవగా, హాయ్ చెప్పి తనను ఇంటిని ఆహ్వానించారని, తన ఫోన్ నెంబర్ తీసుకుని అప్పాయింట్మెంట్ ఇప్పించారని, ఆ తర్వాత వెళ్ళిన సమయంలో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని, వారంతా తన బాబుతో ఆడుకున్నారని, ఎత్తుకుని ముద్దాడారని, ఆ ఫీలింగ్ ఎప్పటికీ మరిచిపోలేనని’ మెగాస్టార్ తో ఉన్న మధురస్మృతులను పంచుకుంది.

ఇక, అందరికీ అభిమాన హీరో అయిన మహేష్ బాబు సినిమా ‘నిజం’ ఆడియో రిలీజ్ కోసం దుబాయ్ వెళ్లామని, అక్కడ మా అమ్మ బ్యాగ్ మిస్సయ్యిందని, తానేమో కంగారుగా అందరినీ ‘బ్యాగ్ దొరికిందా’ అని ప్రశ్నిస్తూ ఉండగా, ఇంతలో వెనక్కి తిరిగి చూస్తే మహేష్ బాబు ఉన్నారని, ‘బ్యాగ్ దొరికిందా’ అని మహేష్ అడగడంతో… ఒక రకమైన ఆశ్చర్యకరమైన హావభావాలతో ‘లేదండి… దొరకలేదు…’ అన్నానని, ఆ తర్వాత బస్సులో ట్రావెల్ అవుతున్నపుడు ‘చిప్స్ తింటారండి’ అని ఇచ్చినపుడు ‘మహేష్ బాబు…’ అని అనుకున్నానని… ఆ తర్వాత ‘పోకిరి’ సమయంలో కూడా కలిసానని, వీరందరితో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

అలాగే ఓ ఆడియో రిలీజ్ కు రెండు రోజుల సమయం ఉందనగా, జూనియర్ ఎన్టీఆర్ ను వెళ్లి అడగడం, ఆ తర్వాత చెప్పిన సమయానికి ఒక్క నిముషం కూడా ఆలస్యం కాకుండా రావడం, స్టేజ్ ఎక్కి చిత్ర గారి తర్వాత తనకు ఇష్టమైన గాయని అని చెప్పడం… తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ పాటను పాడానని గుర్తు చేసుకున్నారు. అలాగే ‘వర్షం’ సినిమా ఆడియో వేడుకలో ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. వీళ్ళంతా చాలా మంచి వాళ్ళని, చక్కగా మాట్లాడతారని మన తెలుగు సినీ హీరోల గురించి చెప్పుకొచ్చారు సింగర్ ఉష.