singer madhupriya realized about her parentsఒక్క అయిదారు మాసాలు వెనక్కి వెళితే… ‘ఆడపిల్ల’ పాటతో బాగా పాపులర్ అయిన సింగర్ మధుప్రియ తన తల్లితండ్రులను కాదని శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహం మధుప్రియ పేరెంట్స్ కు ఇష్టం లేకుండా జరగడంతో, మీడియా వేదికగా ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారి, రచ్చ రచ్చ అయిన సంగతి విదితమే.

“తనను మీ కంటే బాగా చూసుకుంటాడు… ఎటువంటి ఇబ్బంది కలుగనివ్వడు… నా కెరీర్ కు మరింత దోహదం చేసే వాడినే నేను పెళ్లి చేసుకున్నాను….” అని చెప్పిన మధుప్రియే… శనివారం నాడు రాత్రి హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో తన భర్త శ్రీకాంత్ పై ఫిర్యాదు చేసింది. ‘తన భర్త వేధిస్తున్నాడంటూ…’ తల్లితండ్రులను వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

మెహదీపట్నం, విజయనగర్ కాలనీలో భర్తతో కలిసి ఉంటున్న మధుప్రియ, తన తల్లితండ్రుల ఒత్తిడి మేరకే కేసు పెట్టి ఉంటుందని భర్త శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. అయితే ఆనాడు తనతో పాటు వచ్చినపుడు ‘మధుప్రియ వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్పిన శ్రీకాంత్… నేడు మాత్రం తల్లితండ్రుల ఒత్తిడి అని చెప్పడం’ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయనడానికి సంకేతాలు ఇస్తున్నట్లుగా కనపడుతోంది.

అయితే మధుప్రియ తల్లితండ్రులు మాత్రం మొదటి నుండి శ్రీకాంత్ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మధుప్రియ పెళ్ళికి ఒప్పుకోవడం వెనుక కూడా ఏదో బలమైన కారణం ఉందనే అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాదు, ఈ పెళ్లి మున్నాళ్ళ ముచ్చట అవుతుందని అప్పట్లోనే గొంతు పగిలేలా మీడియా వేదికగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే… మధుప్రియ జీవితాన్ని సరిగ్గా అంచనా వేయడంలో తల్లితండ్రులు సరిగ్గానే అంచనా వేసారని తెలుస్తోంది.

ఇక, ఈ కేసును అందుకున్న పోలీస్ వర్గాలు… ముందుగా శ్రీకాంత్ ను పిలిపించి విచారణ చేస్తామని, అవసరమైతే ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు. తన గళంతో ఎన్నో స్టేజ్ లపై పాటలు పాడిన మధుప్రియ, ఇపుడు ఆమె జీవితంపై మరొకరు పాడుకునే స్థితికి రావడం ఆమెను అభిమానించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.