నవ్యాంధ్ర నూతన రాజధాని కోసం గుంటూరు జిల్లా, మంగళగిరి పరిధిలో ప్రభుత్వం సేకరించిన భూములకు రెట్టింపు ధరలు ఇచ్చేందుకు సింగపూర్ సంస్థలు ముందుకు వచ్చాయి. రాజధాని నిర్మాణం, అభివృద్ధి బాధ్యతలను భుజాన వేసుకునేందుకు సింగపూర్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ సంస్థలు సెంబ్ కార్ప్, అసెంబాస్ లు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ రెండు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి, అమరావతిలో ఒక ఎకరానికి 4 కోట్లు ఇస్తామంటూ ప్రభుత్వానికి బిడ్ దాఖలు చేశాయి. బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరల కంటే రెట్టింపు ధరను సదరు సంస్థలు కోట్ చేయడంతో ఏపీ సర్కారు ఆశ్చర్యానికి గురైంది. ఈ కన్సార్టియం బంపరాఫర్ తో మరింత మేర ధర రాబట్టుకునేందుకు ప్రభుత్వం త్వరలోనే బహిరంగ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో లావాదేవీలు భారీగా పతనమై, ధరలు తగ్గుతున్న నేపధ్యంలో సింగపూర్ సంస్థలు దాఖలు చేసిన ధరలు చంద్రబాబు సర్కార్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అయితే త్వరలో జరగబోతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే, ఈ ధర కూడా తక్కువే అవుతుందన్న ఆలోచనలతోనే, ఓపెన్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.