హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేత శిల్పా చక్రపాణిరెడ్డి విరుచుకుపడ్డారు. మాటలు సరిగ్గా రాని బుల్ బుల్ రాజా బాలకృష్ణ కూడా ప్రతిపక్షాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లు బాలకృష్ణ కుటుంబంలోనే ఉన్నారని విమర్శించారు. తమ జోలికి వస్తే బాగోదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆయన ఆరోపించారు.
“వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఓ చారిత్రక సంచలనం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,” అని పొగడ్తలు కురిపించారు ఆయన. చంద్రబాబు ప్రకటించిన రెండు వేల పెన్షన్ కేవలం ఎన్నికల ముగిసే వరకే అందిస్తారనని, అధికారం కోసమే పెన్షన్ పెంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మాదిరే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసే సమయం దగ్గరలోనే ఉందన్నారు.
ఉన్నఫళంగా చంద్రబాబు 1000 రూపాయిలు ఉన్న పెన్షనలను 2000 చెయ్యడంతో ఆ ప్రభావం ప్రతిపక్ష పార్టీ మీద గట్టిగానే పడినట్టు ఉంది. కొందరేమో జగన్ కు భయపడే పెన్షన్లు పెంచారని, మరి కొందరు ఏకంగా ఎన్నికలలో గెలిస్తే మళ్ళీ తిరిగి తగ్గించేస్తారని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షంలో కలవరం మొదలయ్యిందని క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరికీ ఉపయోగం అనేది వారు ఆలోచించుకోవాలి.