పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఓ పక్కన సినిమా చూస్తుండగానే… మరో పక్కన స్మార్ట్ ఫోన్ లో సినిమాల అప్ డేట్స్ ఇచ్చేస్తున్న యుగం ఇది. అవును… స్నాప్ షాట్స్, స్క్రీన్ షాట్స్ అంటూ ధియేటర్ లో బొమ్మ పడుతున్న సమయంలో ఫోటోలు, చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఇవే ఇండియన్ సినిమాలను చంపేస్తున్నాయని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోగా నటించిన యూనివర్సల్ స్టార్ సిద్ధార్ద్ తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా వెలిబుచ్చాడు.
“ఓ పక్కన సినిమా సినిమా చూస్తూ స్మార్ట్ ఫోన్ లో అప్ డేట్స్ ఇచ్చే వారి బ్రైన్ ఫోకస్ దేని మీద ఉంటుంది? స్క్రీన్ మీద? లేక స్మార్ట్ ఫోన్ మీద? సినిమా అంతా చూసిన తర్వాత ఫోన్ లోనో లేక రివ్యూ రూపంలో వారి వారి అభిప్రాయాలు తెలియజేయడంలో తప్పు లేదు… కానీ ‘లైవ్ ట్వీటింగ్?’ ఇండియాలో ప్రతి సినిమా ఇండస్ట్రీ పైరసీ మరియు ఈ అక్రమ రివ్యూలకు గురవుతున్నాయి. దీని వలన సినిమాలలో నటించాలన్న ఆసక్తే పోతోంది. చివరగా… మీకు సినిమా నచ్చితే ప్రశంశించండి… నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగానీ, ప్రేక్షకులను సినిమా చూడకుండా ప్రచారం చేయకండి, గౌరవం ఇవ్వండి” అంటూ ‘లైవ్ ట్వీట్’ ఇచ్చే వారికి ఓ చిన్న సైజు క్లాస్ తీసుకున్నారు సిద్ధార్ద్.
సిద్దూ చెప్తున్న దాంట్లో అర్ధం ఉంది గానీ, ప్రస్తుత సొసైటీలో మొదటి రివ్యూ నేనే పెట్టాలని, మొదటి స్క్రీన్ షాట్ నేనే ఇవ్వాలని… ఇలా సినిమా రివ్యూలపై ప్రేక్షకులు ఫ్యాన్సీగా మారిపోయారు. ముందు ఏదైనా పెద్ద సినిమా వస్తోంది అంటే, రివ్యూల వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే అంతిమంగా తేలుతున్న విషయం ఏమిటంటే… విశ్లేషకులు ఎంత రేటింగ్స్ ఇచ్చినప్పటికీ, సినిమాలో విషయం ఉంటే వాటికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. బహుశా అన్ని సినిమాలలో ఇది వర్తించకపోవచ్చు… అందుకే సిద్దూ ఆవేదన హాట్ టాపిక్ అయ్యింది.