Siddharth comments on ticket price in andhra pradeshఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకు ఏ తెలుగు అగ్ర హీరో కూడా స్పందించలేదు. నిర్మాతగా, దర్శకుడుగా గత 40 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్న రాఘవేంద్రరావు వంటి వారు తమ ఇబ్బందులను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. స్తబ్దుగా ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోలను పక్కన పెడితే, హీరో సిద్ధార్ధ్ మాత్రం తన గళం విప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు తాను కొన్ని సలహాలు ఇవ్వదలచుకున్నానంటూ… అందరికీ ఒకే విధానం కాకుండా, ఒక ఏరియాలో ఇంటి అద్దె మరియు నిత్యావసర వస్తువులపై ప్రజలు ఖర్చు పెట్టే మొత్తాన్ని లెక్కించి, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టికెట్ ధరలను నిర్ణయించండి అంటూ ట్వీట్ చేసారు.

టికెట్ ధరలు మరియు షోల నియంత్రణలపై తీసుకున్న జీవోలు ‘ఎం.ఆర్.టి.పి’ యాక్ట్ కు విరుద్ధంగా ఉందని, సినిమా మరియు సినిమా హాల్స్ బతికేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. ఒక రెస్టారెంట్ లో ఇడ్లీ మరియు కాఫీలకు ఎంత ఛార్జ్ చేయాలని చెప్పలేని మీరు, ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు.

పేదరికంతో మొదలుపెట్టి బిలియనీర్ గా చనిపోయే రాజకీయ నాయకులను గానీ, వ్యాపారవేత్తలను గానీ ప్రశ్నించలేని మీరంతా ఎందుకు సినిమా ఇండస్ట్రీని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆపేయండి! సినిమాను సేవ్ చేయండి అంటూ కాస్త గట్టిగానే చెప్పారు.

ఒక సినిమా యొక్క బడ్జెట్ గానీ, దాని యొక్క పరిధిని గానీ నిర్ణయించేది కస్టమర్ కాదని, ఆ సినిమాను సృష్టించిన క్రియేటర్ లేక పెట్టుబడిదారుడు మాత్రమేనని అన్నారు. సినిమా ద్వారా ఎంత సంపాదించామని అడిగే హక్కు ఏ ఇతర వ్యక్తికి లేదని హీరో సిద్ధార్ధ్ అన్నారు.

25 ఏళ్ళ క్రితం స్టూడెంట్ కార్డు వినియోగించి 8 డాలర్లు వెచ్చించి (అప్పట్లో 200 రూపాయలు) తాను సినిమా చూసేవాడినని, ఇప్పుడు మన సినిమా అన్ని దేశాలతో పోటీ పడుతోందని, అది సాంకేతిక విభాగంలో అయినా, టాలెంట్ లో అయినా, ఉద్యోగాలు కల్పించడంలో అయినా అంటూ ఇండస్ట్రీ ఎదుగుదలను గుర్తు చేసారు.

మన జీవితాలకు ఆహారం అందించడానికి ఒక రైతు పడే కష్టం మనకి తెలుసని, మేము రైతులంతా గొప్పవాళ్ళం కాకపోవచ్చు గానీ, మేము కూడా మనుషులమే, అలాగే మేము కూడా పన్నులు చెల్లిస్తున్నాము, సినిమాను బతికించండి అంటూ వేడుకున్నారు.

మా జీవనం సాగించడానికి మేము ఎంతగానో కష్టపడుతున్నామని, సృజనాత్మకతతో ప్రేక్షకులకు వినోదం అందించే మా చేతులను చంపేయవద్దని హీరో సిద్ధార్ధ్ ట్విట్టర్ వేదికగా తన భావాలను వ్యక్తపరిచారు. ఈ ట్వీట్స్ లో ఏ రాష్ట్రాన్ని గాని, ఏ ఒక్కరికి గాని ట్యాగ్ చేయలేదు. ‘సేవ్ సినిమా’ హ్యాష్ టాగ్ తో తన భావాలను ధైర్యంగా హీరో సిద్ధార్ధ్ వ్యక్తపరిచారు.