Shweta Basu Prasad engaged with boy friend Rohit Mittalశ్రీకాంత్ అడ్డాల ‘కొత్త బంగారు లోకం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన శ్వేతాబసు ప్రసాద్, ఆ తర్వాత ‘రైడ్’ వంటి కొన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లో ఆశించిన అవకాశాలు లభించలేదు. సినిమాలు లేని సమయంలో శ్వేత జీవితంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు పాఠకులకు సుపరిచితమే.

అయితే వాటన్నింటిని విజయవంతంగా అధిగమించి మళ్ళీ తెలుగునాట చిన్న చితక సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోన్న శ్వేతాబసు ప్రసాద్ కు పెళ్లి ఖాయమైంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం శ్వేత స్వయంగా ప్రకటించింది.

ఈ ప్రపోజల్ ను ముందుగా తానే చెప్పానని, గోవాలో రోహిత్ కు తాను ప్రతిపాదించగా, పూణేలో తన అభిప్రాయాన్ని రోహిత్ చెప్పారని, ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి అంగీకారం తెలిపారని, తమ వ్యక్తిగత విషయాలపై ఎలాంటి కామెంట్స్ చేయబోమని… పెళ్ళికి దారి తీసిన పరిణామాలను చెప్పుకొచ్చింది ఈ ‘కొత్త బంగారు లోకం’ పిల్ల.