Shriya Saran in Andhadhun remakeశ్రియ శరన్ నిన్న తన 38వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆర్ఆర్ఆర్ లో త‌న పాత్ర నిడివి చాలా త‌క్కువ ఉంటుందని చెప్పుకొచ్చింది ఆ భామ‌. అదో అతిథి పాత్ర అని, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో త‌న‌కు కాంబినేష‌న్ సీన్లు లేవ‌ని తేల్చేసింది.

అలాగే నితిన్ నటిస్తున్న అంధాధూన్‌ తెలుగు రీమేక్ గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆ సినిమాలో టబూ పాత్రకు శ్రీయని సంప్రదించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ధృవీకరించింది. “వారు నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. ఆ పాత్రలో న‌టించ‌డం గొప్ప గౌరవంగా భావిస్తా,” అంది. అయితే అందులో నటించేదీ లేనిదీ కచ్చితంగా చెప్పలేదు.

“నేను ఇప్పుడు బార్సిలోనాలో ఉన్నాను. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లేసరికి నేను ఇండియా రాగ‌ల‌నా? లేదా? అనే దాని మీద స్పష్టత లేదు. ప్ర‌స్తుతం క‌రోనా అంద‌రినీ భ‌య‌పెడుతోంది. షూటింగ్ మొద‌ల‌య్యేస‌రికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌లేను. ఒక‌వేళ అనుకూలంగా ఉంటే మాత్రం.. త‌ప్ప‌కుండా ఈ పాత్ర‌ని వ‌దులుకోను,” శ్రియ చెప్పింది.

దీనిబట్టి కరోనా కేసులు తగ్గితేనే శ్రీయ ఈ పాత్ర చేస్తుందని అర్ధం అవుతుంది. ఈ పాత్ర కోసం మొట్టమొదట టబూనే సంప్రదించారు నితిన్ బృందం. అయితే చేసిన పాత్రను మళ్ళీ చెయ్యను అని ఆమె చెప్పడంతో ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకునిరావాలి అనేదాని మీద కిందా మీదా పడుతున్నారు.