shocking-facts-about-bangaloreఇండియాలో సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నగరం వచ్చే ఐదు సంవత్సరాల్లో మానవ నివాసానికి వీల్లేని నగరంగా రూపాంతరం చెందనుందని ఇండియాలోనే బెస్ట్ ఇనిస్టిట్యూట్ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సంచలన నివేదికను వెలువరించింది. గడచిన 40 సంవత్సరాల్లో బెంగళూరులో నివాస ప్రాంతాలు 525 శాతం పెరిగిపోయాయని, ఒకనాడు ‘గ్రీన్ సిటీ’గా పేరున్న నగరంలో ఇప్పుడు 78 శాతం వృక్ష జాతి అంతరించి, చల్లగా ఉండే వాతావరణం రికార్డు స్థాయి వేడికి పెరిగిందని హెచ్చరించింది.

నగరంలోని నీటి వనరుల్లో 79 శాతం కరిగిపోయాయని, ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, పట్టణీకరణ నగరాన్ని నాశనం చేస్తున్న పద్ధతిని చూపుతుందని ఐఐఎస్సీ ప్రొఫెసర్ టీవీ రామచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నగరం నివాసయోగ్యం కాదని చెప్పే పరిస్థితి నుంచి, ఐదేళ్లలోనే నగరం రూపురేఖలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే స్థాయికి వచ్చాయని చెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవలి కాలం వరకూ సహజ వాయువులతో నిండిన నగరం, ఇప్పుడు విషపూరిత కాలుష్యాలతో నిండిపోయిందని అన్నారు.

సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న నగరానికి నదుల సౌకర్యం లేదని, కేవలం 600 చిన్న, పెద్ద సరస్సులతో నగరం పచ్చగా ఉండేదని వెల్లడించిన ఆయన, గడచిన రెండేళ్లలో అత్యధిక సరస్సులు అంతరించాయని, నీటిని 100 కిలోమీటర్ల దూరంలోని కావేరీ నది నుంచి పైపుల ద్వారా తేవాల్సి వస్తోందని అన్నారు. 25 ఏళ్ల క్రితం 40 లక్షలుగా ఉన్న జనాభా, ఇప్పుడు కోటికి పైగా చేరుకుందని, ప్రభుత్వాలు వెంటనే స్పందించకుంటే పరిస్థితి మరింత జటిలమవుతుందని హెచ్చరికలు జారీ చేసారు.