shivaji raja Uday kiranఎవరి అండదండలు లేకుండా నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న ఏకైక తెలుగు హీరో ఉదయ్ కిరణ్, ప్రస్తుతం మన మధ్య లేడన్న విషయం తెలిసిందే. ఈ హీరో మరణం వెనుక మెగా ఫ్యామిలీపై అనేక ఆరోపణలు వ్యక్తం కాగా, తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ ను తలచుకున్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. ప్రతి ఏటా ఉదయ్ కిరణ్ స్మారకంగా షార్ట్ ఫిల్మ్స్ పోటీలను నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు.

అందులో భాగంగా ఈ ఏడాది కూడా విజేతలకు పురస్కారాలు అందిస్తూ… ఉదయ్ కిరణ్ స్మరించుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎదిగిన ఉదయ్, అర్ధాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసారు. నాడు కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్ ను సినీ పరిశ్రమ వర్గీయులు ఆదుకుని ఉంటే, పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఉదయ్ మరణానికి పరోక్షంగా సినీ ఇండస్ట్రీనే కారణమని అభిప్రాయపడ్డారు.

కెరీర్ లో ఎదుగుతూ… ఒక హీరోగా స్థిరపడిపోయిన సమయంలో చిరంజీవి తనయురాలితో జరిగిన నిశ్చితార్ధ వేడుకే ఉదయ్ కిరణ్ జీవితాన్ని మలుపు తిప్పింది అన్నది బహిరంగ సత్యమే. అయితే ఆ తర్వాత తెర వెనుక ఏం జరిగిందో పైనున్న వాడికే తెలియాలి గానీ, పెళ్లి కాన్సిల్ కావడం, మరో వైపు ఉదయ్ కిరణ్ కు సినీ అవకాశాలు దూరం కావడం ఒకేసారి జరుగుతూ వచ్చి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి… చివరికి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు.