పవన్ కళ్యాణ్ కంటే మెరుగైన గ్రౌండ్ వర్క్ చేస్తున్న షర్మిలపవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఉన్న పాపులారిటీకి షర్మిల పార్టీ సరిపోక పోవచ్చు. అయితే రెండు కొత్త పార్టీలే కావున పోలికలు చూడటం అనేది సాధారణం. అయితే చాలా మంది అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ కంటే షర్మిల మెరుగైన గ్రౌండ్ వర్క్. రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించిన నాటి నుండీ షర్మిల వరుస భేటీలతో బిజీగా ఉన్నారు.

జిల్లాల వారీగా రాజశేఖరరెడ్డి అభిమానులను కలుస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత మాత్రం ఏప్రిల్‌ 9న ఖమ్మంలో జరిగే సభలో ఇవ్వనున్నారు. ఖమ్మం సభ తర్వాత షర్మిల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని, ఈ పర్యటనలు జూలై 8 లోపే ముగుస్తాయనీ చెబుతున్నారు.

వైఎస్‌ జయంతి రోజున హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును షర్మిల ప్రకటిస్తారని తెలుస్తోంది.  వీటి అన్నిటికంటే ముఖ్యంగా పార్టీకి మండల స్థాయిలో కమిటీల ఏర్పాటులో షర్మిల బిజీగా ఉన్నారు. మండలానికి ముగ్గురితో ఈ కమిటీలను వేయాలని, ఈ నెల 16 కల్లా కమిటీల నియామకం పూర్తి చేస్తారని సమాచారం.

తరువాత మండల కమిటీలను విస్తరించి గ్రామా స్థాయి కమిటీలను కూడా సిద్ధం చెయ్యాలని ఆలోచనట. పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్ళేది ఈ కమిటీలే కావున ఏ పార్టీ కైనా ఈ కమిటీలు చాలా కీలకం. 2014లో పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్  ఆంధ్రప్రదేశ్ లో మండల్ స్థాయి కమిటి ఏర్పాటు ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు. అదే తెలంగాణ విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫలితం సంగతి పక్కన పెడితే పార్టీ కోసం షర్మిల 100% కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ నుండి కూడా ఇదే నిబద్దత అభిమానులు కోరుకుంటున్నారు.