‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా విశేషమైన గుర్తింపు పొందిన వారిలో హీరోయిన్ షాలిని పాండే కూడా ఉంది. మొదటి చిత్రంతోనే అదిరిపోయే హిట్ ను అందుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లలో అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మహేష్ బాబు 25వ చిత్రంలో కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి గానీ, ఇంతవరకు అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే ఇంత ఫేం వెనుక తన కష్టం చాలా ఉందని తాజాగా కోలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సీన్స్ లో నటించేటపుడు తాను నరకయాతన అనుభవించానని, అసలు విషయాన్ని కాస్త నిదానంగా చెప్పుకొచ్చింది. అంతకుముందే నిజజీవితంలో తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని, దీంతో అలాంటి అనుభూతి ఉన్న సీన్లే చేస్తున్నపుడు, నిజమైన బాధతో చేసానని వివరించింది.
అంటే ‘అర్జున్ రెడ్డి’లో నటించలేదు, ఏకంగా జీవించేసానని శాలిని చెప్పకనే చెప్తోందన్న మాట. తన ఇంట్లో వాళ్లకి తాను సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా, ఇంటి నుండి బయటకు వచ్చి ఇండస్ట్రీకి వచ్చానని, ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత అందరూ అక్కున చేర్చుకున్నారని తెలిపింది. అలాగే సినిమాల్లోకి రాకముందు ముంబైలో సింగిల్స్ కు రూమ్ దొరకకపోతే మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉన్న మాట వాస్తవమే గానీ, వారు ఎప్పుడూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది.