Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitramమాజీ పోర్న్ స్టార్ షకీలా ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రమ్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫిబ్రవరిలో విడుదలైంది. ఆ టీజర్ లో అప్పట్లో రాజకీయ పరమైన ప్రస్తావన ఉండటం గమనార్హం. టీజ‌ర్‌లో కుర్చీలో కూర్చుని ఉన్న షకీలా ఓ పత్రికలో పతాక శీర్షిక ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ను చూడటం ఆ టీజర్ లో కనబడుతుంది.

‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ తన పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తిని షకీలా ప్రశ్నించగా…‘అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేశారుగా’ అని సమాధానం చెబుతాడు. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను.. ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ షకీలా విస్మయం వ్యక్తం చేస్తుంది.

ఏదో సెన్సేషన్ కోసం పెట్టారో లేక నిజంగా సినిమాకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉంటుందో తెలీదు. ఎప్పుడు విడుదల చేద్దాం అనుకున్నారో తెలీదు గానీ ఇప్పుడు ఈ చిత్రం దాని థియేట్రికల్ విడుదలను దాటవేసి నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల అవ్వబోతుంది.

ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందిందో స్పష్టంగా తెలియదు, కాని ‘స్ట్రీమింగ్ సూన్’ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విక్రాంత్, పల్లవి ఘోష్ నటించిన ఈ చిత్రానికి షకీలా కథ రాశారు. వీఎన్ సతీష్ ఈ సినిమా కోసం మెగాఫోన్‌ను పట్టుకున్నారు. సిహెచ్ వెంకట్ రెడ్డి తన 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షకీలా కీలక పాత్రలో కనిపించనుంది.