‘సెల్ఫీ’ క్రేజ్ రానూ రానూ కాస్త పిచ్చిగా ముదురుతున్నట్లు కనపడుతోంది. స్నేహితులు, బంధువులు, ఫేస్ బుక్ లైకింగ్స్ కోసం యువత చూపుతున్న ఉత్సాహం ముందు ప్రాణాలు బలిపశువులవుతున్నాయి. ఒక ఫోటో సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.
తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్లో సెల్ఫీ తీసుకుంటూ పదో తరగతి విద్యార్థి మంజిత్ కుమార్ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కు గురై మరణించాడు. పురానాఫూల్ కు చెందిన ముంజిత్ జూలోని బట్టర్ ఫ్లై పార్క్ లోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు జారి ఫౌంటేన్లో పడ్డాడు. దాంట్లోని విద్యుత్ తీగలు బాలుడికి తగిలాయి. గాయాలపాలైన విద్యార్థి ముంజిత్ ను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే అతడు మృతి చెందినట్టు సమాచారం.