శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమాలలో “లీడర్” సినిమా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. బహుశా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోనప్పటికీ, ‘లీడర్’లో ఉన్న సున్నితమైన డైలాగ్ లకు మనసున్న ప్రతి ప్రేక్షకుడు “ఫిదా” అయ్యాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించలేదన్నది కూడా వాస్తవం. ఈ సినిమా ఎందుకు ఆడలేదు? అన్న ప్రశ్నను శేఖర్ కమ్ములను అడిగితే… ఏం చెప్తారో తెలుసా…
మేకింగ్ విషయంలో తానూ ఎక్కడ పొరపాటు చేయలేదని, నిజానికి తానూ దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుందని భావించానని, అలాగే ప్రేక్షకుల నుండి ఒక వేవ్ లాంటి స్పందనను ఊహించానని, కానీ రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకోకపోవడంతో, దానిని చాలా వ్యక్తిగతంగా తీసుకున్నానని… తన ఆవేదన వెలిబుచ్చాడు శేఖర్. బహుశా తన నుండి ఇలాంటి పొలిటికల్ సినిమా వస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చని, ఇదొక కారణంగా చెప్పారు.
అయితే ‘లీడర్’ సినిమా విడుదలకు ముందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందడం, ఆ తర్వాత జగన్ ఎపిసోడ్ రసవత్తరంగా జరగడం వంటి రియల్ సన్నివేశాలు… ‘లీడర్’ సినిమాలో రీల్ సన్నివేశాలుగా మారడం… ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్ల విలువైన ఆస్తులను వెనుకేయడం వంటి సన్నివేశాలతో “లీడర్” సినిమాను ఒక వర్గానికే పరిమితం చేసారని, ఆ విధంగా వైఎస్సార్ – జగన్ ఎపిసోడ్ “లీడర్” సినిమాను నట్టేట ముంచినట్లుగా అప్పట్లో జరిగిన ప్రచారంపై మాత్రం శేఖర్ కమ్ముల నోరు మెదపలేదు.