Security Downsized for Chandrababu Naidu Familyమాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత కుదించింది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తొలగించటంతో పాటు, చంద్రబాబు వాహనశ్రేణిలో స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్‌, పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనాలను తొలగించిన జగన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భద్రత రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపుకు పాల్పడుతుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు.

చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నుండి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత ఆయన 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నా అప్పటి ప్రభుత్వాలు భద్రత విషయంలో అలసత్వం ప్రదర్శించలేదు.

ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పిస్తూ వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ తొలగించి ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున రెండు బృందాలుగా 2+2గా మాత్రమే కేటాయించింది. దీనిపై ఎలా ముందుకు పోవాలి అనేదాని పై చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భద్రత విషయంలో అలసత్వం పనికి రాదని కోర్టుకు వెళ్తే మంచిదని కొందరు నాయకులు చంద్రబాబుకు సూచిస్తున్నారని తెలిసింది.