savyasachi firstday talkఅగ్ర హీరోలతో వరుసగా మూడు సినిమాలు చేసిన ట్రాక్ ఉన్న మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ… కెరీర్ లో వరుసగా రెండు హిట్లతో ఊపు మీదున్న దర్శకుడు చందు మొండేటి… ఈ కాంబోలో అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో “సవ్యసాచి” పేరుతో తెరకెక్కించిన సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలకు ముందు ఉన్న పాజిటివ్ వైబ్, సినిమా రిలీజ్ తర్వాత కూడా ఉందా? అంటే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యే విధంగా ఈ సినిమా ‘ఫస్ట్ టాక్’ వినపడుతోంది. కధలో ఎడమచేయి కాన్సెప్ట్ తప్ప, మిగిలినదంతా రొటీన్ రివేంజ్ స్టోరీగా తెరకెక్కడంతో, ప్రేక్షకులు ఆశించిన సరికొత్త కధ, కధనం కరువయ్యింది.

క్లైమాక్స్ లో వచ్చే చైతూ – మాధవన్ ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఈ ఇద్దరు హీరోలు కూడా తమ స్థాయికి తగ్గ ప్రతిభను స్క్రీన్ పై చూపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్స్ పరంగా ఓకే అనిపించగా, ‘కార్తీకేయ’తో ఔరా అనిపించిన దర్శకుడు చందు మొండేటి స్థాయిలో ఈ సినిమాలో కొత్తదనం కనిపించకపోవడం ప్రేక్షకులకు రుచించని అంశం.

బాక్సాఫీస్ వద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ టాక్ తో “సవ్యసాచి” ఎంతవరకు రాణిస్తుందో వేచిచూడాలి. చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాను ఈ ‘సవ్యసాచి’ అధిగమిస్తుందో లేదో!? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు చందుని హీరో చైతూ ‘ఈ సారి తేడా కొట్టదు కదా?’ అని ఎందుకు అడిగారో సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.