జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సరిహద్దులో ఉన్న వాతావరణంపై ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తనకు కొందరు మందే చెప్పారని, దీనిబట్టి దేశంలో ఎలాంటి పరిస్థితిలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలలో లబ్ది పొందడానికి ఇప్పటి పరిస్థితిని బీజేపీ కావాలని సృష్టించింది అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసారు పవన్ కళ్యాణ్. జనసేనాని చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. దీనితో పవన్ కళ్యాణ్ నష్టనివారణ చర్యలు చెప్పట్టారు. యుద్ధం వస్తుందని తనకు ఎవరూ చెప్పలేదని, కేవలం ఫైనాన్సియల్ టైమ్స్, గార్డియన్ లాంటి పత్రికలలో పరిస్థితుల బట్టి విశ్లేషకులు అలా అంచనా వేశారని, దానినే తాను చెప్పా అని పవన్ కళ్యాణ్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన చేసిన పొరపాటు వ్యాఖ్యలను సమర్ధించుకోలేక అభిమానులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇలా కొన్ని కొన్ని గాలి మాటలు చెప్పడం పవన్ కళ్యాణ్ కు కొత్తేమి కాదని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. “ఏదో ఒక విమర్శ చేసెయ్యడం. రుజువు చెయ్యమని అడిగితే నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనడం పవన్ కళ్యాణ్ కు పరిపాటే,” అని వారు ఆరోపిస్తున్నారు. గతంలో లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేసి అడిగితే అందరూ అనుకుంటున్నారని మాత్రమే చెప్పా అని అన్నారు.
ఆ తరువాత తిరుమలలో ఆభరణాలు దేశం దాటించేస్తున్నారు అని ఎవరో అధికారి ఎయిర్ పోర్టులో చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రత్యర్థుల మీద పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటూ గాలి వ్యాఖ్యలు చెయ్యడం మాములే కాకపోతే ఈ సారి మాత్రం దొరికిపోయారు అని వారు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలలో ఉండే వారు పారదర్శకంగా మాటలాడకపోతే వారికే కాదు. దేశానికే అప్రతిష్ట. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలుసుకుంటే ఆయనకే మంచిది. అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేలా?