మొన్న ఆ మధ్య జరిగిన నిజామాబాదు ఎంపీ ఎన్నికలలో రైతులు పెద్ద సంఖ్యలో కేసీఆర్ కుమార్తె కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసి తెలంగాణ ప్రభుత్వం పై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ పడిందో లేదో గానీ కవిత ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ఇప్పుడు తాజగా హుజూర్ నగర్ ఉపఎన్నికలో కూడా అటువంటిదే జరగబోతుంది.
సర్పంచుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచులు నామినేషన్లు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ప్రకటించింది. సర్పంచుల ఎన్నిక జరిగి 9 నెలలు కావొస్తున్నా.. అధికారాలు, విధులు, నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది ప్రతిపక్షాల కుట్ర అని, తమ గెలుపుని ఎవరు ఆపలేరని అంటున్నారు. మంత్రి కేటీఆర్ నిన్న తన వద్ద ఖచ్చితమైన సర్వే రిపోర్టు ఉందని.. దాని ప్రకారం తెరాసకు 54.64% ఓట్లు వస్తాయని కాంగ్రెస్ కు కేవలం 42% మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని గంటాపథంగా చెబుతున్నారు.
ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. ఆయన స్థానం నుండి తన భార్య పద్మావతి పేరును అభ్యర్దిగా ప్రకటించారు. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన సైదిరెడ్డినే తిరిగి అభ్యర్ధి గా ప్రకటించారు.
గత ఎన్నికలలో ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడంతోనే స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టెక్కారని ఈ సారి ఆ గుర్తు తొలగించడంతో తమ గెలుపు ఖాయమని అధికార పక్షం వాదన.