యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన సంజనా ఇప్పుడు ఒక వివాదాస్పద విషయంలో వార్తల్లోకి ఎక్కింది. మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం… ఆదివారం రాత్రి రిచ్మండ్టౌన్లోని ఓ స్టార్ హోటల్లో ఆమె, బాలీవుడ్ నిర్మాత వందనాజైన్ గొడవ పడ్డారు. ఏకంగా మద్యం బాటిల్ను వందనాజైన్పై విసిరినట్టు సమాచారం
దీనిపై వందనా బెంగళూరులోని కబ్బన్పార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా కొందరు సినిమా రంగానికి చెందిన ప్రముఖుల కలగజేసుకుని రాజీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై సంజనా మాట్లాడుతూ.. వందనాజైన్తో గొడవ జరిగిందని, అది చిన్నపాటిదేనని, తమ మధ్య చాలాకాలంగా సన్నిహితం ఉందని అన్నారు. హోటల్లో గొడవ రాజీ చేసుకున్నామన్నారు.
అయితే ఆమె ఆ నిర్మాతపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. వందనాజైన్కు 200 కోట్ల ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. “బెంగళూరులో ఆమెకు ఎటువంటి వ్యాపారాల కంపెనీలూ లేవు, కానీ రూ. 200 కోట్ల అక్రమ ఆస్తి ఉంది. అలాగే ముంబైలో రూ. 20 కోట్ల విలువ చేసే బంగళా ఉంది. బెంగళూరు బ్రిగేడ్ రోడ్డులోనూ ఆస్తులు ఉన్నాయి, ఆమె ఇల్లు కూడా అక్రమమే,” అంటూ ఆరోపించారు.
సంజనా తెలుగులో చివరిగా 2017లో వచ్చిన సునీల్ నటించిన 2 కంట్రీస్ చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు ఇక అవకాశాలు రాలేదు. బుజ్జిగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తెలుగులో డజన్ సినిమాలకు పైగా చేసినా బ్రేక్ రాలేదు. అయితే కన్నడ చిత్ర సీమలో మాత్రం ఆమె ఒక మోస్తరు బిజీ నటే.