sania-mirza-completes-80-consecutive-weeks-as-world-no-1భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సరికొత్త చరిత్రకు వేదిక అయ్యింది. ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్ లో వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ గా నిలిచి సత్తా చాటింది. గత సీజన్ లో మార్టినా హింగిస్ తో కలసి వోల్వో కార్ ఓపెన్ టైటిల్ గెలిచి నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న సానియా… అప్పటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది.

సానియా, మార్టినా హింగిస్ లు కలసి 12 నెలల్లో ఏకంగా 13 టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో 41 మ్యాచ్ లను వరుసగా గెలుపొందారు. అయితే, గత ఆగస్టులో ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. భారతదేశం తరపున నంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రమే. ఇదొక అద్భుత ప్రయాణమని… మరింత కష్టపడటానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. సానియా సాధించిన ఘనతకు మహేష్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాలలు అభినందనలు తెలిపారు.