samantha-excited-about-her-new-projects-in-telugu-audience-in-suspenseత్వరలో అక్కినేని వారింట అడుగు పెట్టబోతున్న ‘కుందనపు బొమ్మ’ సమంత, ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ… తానూ కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసానని, ఆ వివరాలు వెల్లడించాలంటే ఎక్సైటింగ్ ఉందని చెప్తూ అభిమానులను ఊరించింది. అయితే సుకుమార్ – చెర్రీల సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని, అలాగే బాబీ – ఎన్టీఆర్ సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ అని… ఈ విషయాలు వెల్లడించడానికే ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచిందన్న టాక్ సినీ జనాల్లో వ్యక్తమయ్యింది.

అయితే ఇంతకంటే పెద్ద షాక్ ఇచ్చేందుకు సమంత సిద్ధమైందని తాజాగా వెలుగుచూసిన సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో నటిమణి అంటే టక్కున గుర్తుకు వచ్చే “సావిత్రి” జీవితకధ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో సమంత నటించేందుకు సంతకాలు చేసినట్లుగా సమాచారం. రేపో మాపో సమంతనే అధికారికంగా వెల్లడించబోయే ఈ వివరాలు ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ హాట్ గా సందడి చేస్తున్నాయి. ఈ సినిమాకు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నారు.

సావిత్రి బయోపిక్ లో నటించే అవకాశం దక్కడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో సంచలనాలకు నాందిగా సావిత్రి వ్యక్తిగత, ప్రోఫెషనల్ జీవితం నిలిచింది. ఎలాంటి హావభావాన్ని అయినా కళ్ళతోనే పలికించగల అద్భుతమైన నటి సావిత్రి. అలాగే వ్యక్తిగత జీవితంలో ప్రస్తుత తరానికి తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిన్నింటిని నిజంగా వెండితెర రూపం తీసుకువస్తే… టాలీవుడ్ లోనే ఒక సంచలనాత్మక సినిమాగా నిలిచిపోవడం ఖాయంగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.