న్యాయాలందు సెలబ్రిటీలకు జరిగే న్యాయం వేరన్న విషయం… వివిధ సందర్భాలలో నిరూపణ అయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే జింకలను వేటాడిన కేసులో ఇటీవల రాజస్తాన్ కోర్టు సల్మాన్ ఖాన్ ని నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 1998లో రాజస్తాన్ లో జరిగిన వేట సందర్భంగా నమోదైన కేసులో అప్పటి సల్మాన్ ఖాన్ జీపు డ్రైవర్ హరీష్ దులానీ ప్రధాన సాక్షిగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే 2002 నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా హరీష్, తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ కు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘తమ కుటుంబానికి వస్తున్న బెదిరింపుల రీత్యా ప్రాణ భయంతో ఊరు విడిచి పారిపోయామని, అయితే సల్మాన్ ఖానే స్వయంగా జింకను తుపాకీతో షూట్ చేసాడని, అంతేకాకుండా జీపు దిగి జింక గొంతు కూడా కోసాడని, తమకు రక్షణ కల్పిస్తే సాక్ష్యం చెప్పేందుకు తానూ సిద్ధమని’ తెలపడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైంది.
ఇప్పటికే కోర్టు తుది తీర్పును వెల్లడించిన సమయంలో… జీపు డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ కేసును తిరగదోలుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి, సడెన్ గా ప్రత్యక్షం కావడం వెనుక ఆలోచనలు ఏమిటి? అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ఈ ట్విస్ట్ సల్మాన్ జీవితంలో పెను ప్రభావితం చూపుతుందా? అని అభిమానులు పడుతున్న ఆందోళనకు కాలమే సమాధానం చెప్పాలి.