Sakshi Singh - Dhoni Aadhar Tweetటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల తన ఆధార్ సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవడం కోసం, కామన్ సర్వీసెస్ సెంటర్ సేవలను వినియోగించుకున్నాడు. దీంతో ఆ విభాగం వాళ్లు దాన్ని ఫోటో తీసుకుని, ప్రచారం కోసం వాడుకున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే వాళ్లు ధోనీ ఫోటోతో పాటు ఆయన దరఖాస్తు ఫోటోను కూడా ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. దీంతో ధోనీ భార్య సాక్షికి ఎక్కడలేని కోపం వచ్చింది.

వెంటనే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ట్యాగ్ చేస్తూ… తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పరిచే అధికారం ఎవరిచ్చారంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిశంకర్ ప్రసాద్ కూడా ధోనీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకుంటున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంటనే స్పందించి, తాను పెట్టిన ఫోటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ప్రశ్నించారు.

అయితే సీఎస్ సీ గవర్నెన్స్ వారు చేసిన ట్వీట్ లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి కేంద్ర మంత్రికి సాక్షి పంపించారు. దీంతో అందులో జరిగిన తప్పును గ్రహించిన ఆయన, దానిపై చర్యలు తీసుకుంటామని సాక్షికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు సాక్షికి ధన్యవాదాలు తెలుపగా, తనకు సరైన సమాధానం ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సాక్షి కూడా థ్యాంక్స్ తెలిపారు.