నిన్న కాకినాడ లో జనసైనికులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పవన్ కళ్యాణ్ పై కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, ఏకవచన సంబోధన ను నిరసిస్తూ .. కాకినాడ భానుగుడి సెంటర్లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా వారిపై అధికార పార్టీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఇదంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అక్కడితో అయిపోలేదు. ఈరోజు సాక్షిలో జనసైనికులే ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారని రాశారు. ఎమ్మెల్యే వాడిన బూతులు గురించి కూడా రాయకుండా కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వంతపాడటాన్ని మాత్రమే తమ ఎమ్మెల్యే తప్పు పట్టరాని రాసుకొచ్చారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకూ సాక్షి పత్రిక జనసైనికులకు కరదీపికగా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పు పడుతూ రాసే వార్తలని నిజమని నమ్మే వారు వాటిని చూపించి విమర్శలు చేసేవారు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటి రెండు సార్లు సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ చూపించి చంద్రబాబుని విమర్శించేవారు. ఇప్పుడు సాక్షి రాతలు ఎంత నిజం అనేది వారికి అర్ధం అయివుంటుందని టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.