YS- Jagan - Sakshiతెలుగు వార్తాపత్రికలలో నెంబర్ 2 సాక్షి. జర్నలిజంలో తలపండిపోయిన ఎడిటర్లు మా టీం లో ఉన్నారంటూ తరచూ క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే జగన్ కు సంబందించిన వార్తలకు వచ్చే సరికి ఆ స్టాండర్డ్స్ ఏమైపోతాయో. ముఖ్యమైన సందర్భాలలో పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ కరపత్రిక గా మారిపోతుంది. ఈరోజు ఏకంగా ‘ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం’ అంటూ ఒక బ్యానర్ ఐటెం అంటూ రాసేసింది. అదేంటి ఫలితాలకు ఇంకో రోజు ఆగాలి కదా అనుకుంటే కిందనే విశ్లేషకుల మాట అంటూ ఒక తోక యాడ్ చేసింది.

నిన్ననే ఎగ్జిట్ పోల్స్ గురించి రాసి ఈరోజు ఇంకో ఐటెం అదన్నమాట. సరే ఒకటో తారీఖుకు జీతం ఇచ్చే యజమాని ఆ మాత్రం స్వామి భక్తి ఎందుకు ఉండదు? ఆ ఐటెంలో టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలను దుమ్మెత్తి పోసింది. లగడపాటి రాజగోపాల్ వంటి వారిని అయితే రెండు రోజులుగా ఆ పార్టీ వారు శాపనార్ధాలే పెట్టేస్తున్నారు. ఇక విషయానికి వస్తే టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలను ఏకంగా బోగస్ అనేసింది సాక్షి.

“మిషన్‌ చాణక్య సంస్థ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్‌ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయటపెట్టారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు కొన్ని బోగస్‌ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది”, ఇది ఆ ఐటెం లోని ఒక మాట. విషయానికి వస్తే మిషన్ చాణక్య అనే సంస్థ పేరే ఎవరూ విని ఉండరు. టుడేస్ చాణక్య సర్వే కరెక్టో తప్పో తెలీదు గానీ 2014 ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందని లెక్కలతో సహా కరెక్టుగా చెప్పిన సంస్థ అది. సాక్షి తన సౌకర్యం కోసం దానిని బోగస్ సంస్థ చేసేసింది.