ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ తన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. మంత్రిగా నియమితులై ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ చట్టసభల్లో సభ్యుడు కాకపోవడమే దీనికి కారణం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గతేడాది మావోయిస్టుల చేతిలో హతమైన అనంతరం ఆయన కుమారుడు శ్రావణ్కుమార్కు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే అప్పటికి ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు.
ఏప్రిల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన తన తండ్రి స్థానమైన అరకు నుండే పోటీ చేశారు. ఆ ఫలితాల వచ్చే లోగానే ఆరు నెలల గడువు పూర్తి కావడంతో రాజీనామా తప్పని సరి. అయితే ఈ లోగా సాక్షి శ్రావణ్ పై మొసలి కన్నీరు కారుస్తుంది. చంద్రబాబు అతనిని కనీసం ఎమ్మెల్సీగా కూడా చెయ్యలేదని, దాని వల్ల ఇప్పుడు పదవి ఊడుతుందని ఊదరగొడుతుంది. ఒంటి మీద ముప్పై ఏళ్ళు కూడా లేని యువకుడికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చిన సంగతి మర్చిపోయింది.
ఇదే సాక్షి శ్రావణ్ రాజభోగాలు అనుభవించారు తప్పితే.. మంత్రిగా క్రీయాశీలంగా వ్యవహరించలేదు. పైగా యువతలతో షికార్లు, జల్సాలతో వార్తల్లోకెక్కారు అంటూ గిరిజన యువ నాయకుడిపై తన అక్కసు వెళ్ళగక్కింది. ఒక వైపు మంత్రిగా అతను అర్హుడు కాదు అంటూనే ఇంకో పక్క ఆయనను ఎమ్మెల్సీ చెయ్యలేదు అనడం సాక్షికి మాత్రమే చెల్లింది. ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వస్తాయి. గత ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతాలలో టీడీపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. తండ్రి మరణం వల్ల వచ్చే సానుభూతి కూడా శ్రావణ్ కు సాయపడొచ్చు.