కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగిన నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తనదైన శైలిలో వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు సంధించారు. “తనకు ఉన్న ఆస్తి ప్రజల్లో తనపై ఉన్న విశ్వాసమేనని, చంద్రబాబులా తనకు ప్రచారం చేసి పెట్టే మీడియా కూడా లేదని” జగన్ అంటున్నారని… అది నిజమైతే, సాక్షి వార్త పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో జగన్ చెప్పాలని బాలకృష్ణ నిలదీశారు.
తనకు మీడియా లేదని జగన్ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని, అదీగాక, ఆస్తులు కూడా లేవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సాక్షి పేపర్, టీవీ ఆస్తులను సీబీఐ, ఈడీ జప్తు చేశాయని, అవి జగన్కి చెందినవి కావా? అంటూ ప్రశ్నలు సంధించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తారని, భూమా నాగిరెడ్డికి అదే ఘన నివాళి అని బాలయ్య అన్నారు.
నాన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీని అభిమానులంతా ఆదరించారని… ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరచాలని అన్నారు. తానెప్పుడు షూటింగ్స్ కోసం వచ్చినా… తన కోసం భూమా కుటుంబం తమ ఇల్లు ఇచ్చేవారని, భూమా కుమార్తె అఖిలప్రియ మంత్రి కావడం సంతోషంగా ఉందని చెప్పిన బాలయ్య, తన ‘ఒక్క మగాడు’ సినిమాలో కులాలపై ఉన్న డైలాగును చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.