మొన్న ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వ కాంట్రాక్టు కోసం 150 కోట్లు హవాలా చేశారని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఇప్పుడు సాక్షి తెలివిగా ఆ మకిలి చంద్రబాబుకు అంటించే ప్రయత్నం చేసింది. సాక్షి ప్రతినిధి తనకు తెలిసిన సీనియర్ అధికారి చెప్పినట్టుగా చంద్రబాబు పేరు డైరెక్టుగా ప్రకటించకుండా ఆర్టికల్ లో మాత్రమే ఆయన పేరు చెప్పకనే చెప్పింది.
సరే ఈ కథనం నిజానిజాలు మనం ఇప్పుడు ధృవీకరించలేం అయితే సాక్షి ఆ ఆర్టికల్ ముగించిన తీరు అద్భుతం అనకుండా ఉండలేం. ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూపే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ పచ్చ మీడియా ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. తెరవెనక ముఖ్య నేత ఎవరో తెలియడం వల్లే సీబీడీటీ ప్రకటన వచ్చి నాలుగు రోజులైనా ఒక్క కథనాన్నీ వండి వార్చలేదు అంటూ సాక్షి చెప్పింది.
లేదంటే ఇప్పటికే మీడియా అది జగన్ కు ఆపాదించేది అని చెప్పుకొచ్చింది. ఒకవేళ నిజంగా ఆ దాడిలో పట్టుబడింది జగన్ గానీ ప్రస్తుత ప్రభుత్వం గానీ అయినా ఆదాయపన్ను శాఖ ఇప్పటిదాకా దానిని ధృవీకరించలేదు. ఒకవేళ మీడియాకి ఖచ్చితమైన సమాచారం ఉండి రాసినా ఇటీవలే తెచ్చిన జీవో తో మీడియా మీద కేసులు పెడతారు.
కాబట్టి ఇటువంటి ధృవీకరించలేని వార్తలను మీడియా రాయడానికి భయపడుతుంది. అందువలన ఆ కేసులో ఎవరికో క్లీన్ చిట్ ఇచ్చినట్టు లేక ఎవరో దోషి కాబట్టి వార్తలు వెయ్యలేదు అని సాక్షి తెలివిగా రాసుకురావడం సాక్షి మార్కు జర్నలిజం అని చెప్పుకోవాలి.