Sajjala-Ramakrishna-Reddyఒకప్పుడు రాజకీయ నాయకులందరూ తాము ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చామని అబద్దాలు చెప్పేవారు. ఇప్పటి నాయకులు జంకూ గొంకూ లేకుండా అధికారమే మా లక్ష్యం అని చెప్పేస్తున్నారు. మరో 20-30 ఏళ్ళు మేమే అధికారంలో ఉండాలనుకొంటున్నామని కూడా చెప్పేస్తున్నారు.

కానీ అంతలోనే ఆ మాట మరిచిపోయి, “మిగిలినవారికి రాజకీయాలు ఓ గేమ్ అయితే మాకు మాత్రం ఓ టాస్క్” అని ఒక ముఖ్యమంత్రి చెపితే మరొక సిఎం “మేము ప్రజల కోసమే రాజకీయాలు చేస్తాము తప్ప రాజకీయాల కోసం కాదని” చెపుతుంటారు. కానీ అందరూ చేసేవి రాజకీయాలే. కానీ మద్యలో ‘ప్రాస’ కోసం ప్రజలనే పదం కలుపుతుంటారు అంతే! గత మూడున్నరేళ్ళుగా ఏపీలో ఏం జరిగింది? అని ప్రశ్నించుకొంటే ‘రాజకీయాలు’మాత్రమే అని అర్దమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “మాకు రాజకీయ ఎత్తుగడలు అవసరమే లేదు. మేము ప్రజల కోసమే చాలా పారాధర్శకంగా పనిచేస్తుంటాము. కనుక ప్రజలు మమ్మల్ని ఓన్ (సొంతం) చేసుకొన్నారు. మమ్మల్ని ప్రజలు సొంత మనుషులుగా భావిస్తున్నప్పుడు ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా వాటి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. కనుక కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాము తప్ప వాటి వలన కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకోవలసిన అవసరం మాకు లేదు. పార్టీలు పెరిగితే తప్పకుండా వాటి మద్య పోటీ పెరుగుతుంది కనుక దానిలో నేగ్గేందుకు మేము మా పనితీరును మరింత మెరుగుపరుచుకొనే అవకాశం లభిస్తుంది,” అని అన్నారు.

పిల్లల పాఠ్య పుస్తకాలలో లోకంలో అంతా సవ్యంగా ఉందన్నట్లే ఉంటుంది కానీ బయట వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. సజ్జల చెపుతున్న ఈ మాటలు కూడా పాఠ్య పుస్తకాలలో చెప్పినట్లుగానే ఉన్నాయి.

సజ్జల చెప్పినట్లు ప్రజలు వైసీపీని ఓన్ చేసుకొన్నట్లయితే, రాజకీయాలు ఇంత సాదాసీదాగా ఉన్నట్లయితే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఎందుకు ప్రణాళికలు రచించి అమలుచేస్తోంది?మరో ఏడాదిన్నర తర్వాత వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకు వైసీపీ ఎందుకు ఇన్ని తిప్పలు పడుతోంది?అనే సందేహం కలుగకమానదు.

దేశంలో, రాష్ట్రాలలో రాజకీయాలు కనీవినీ ఎరుగని నీచస్థాయికి దిగజారిపోయాయి. కనుక ఆ బురదకుంటలో పొర్లుతూ నీతులు చెపుతుంటే అందరూ నవ్విపోతారు. కనుక వ్యవస్థలను కాదు… ముందు రాజకీయాలనే సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే నీచరాజకీయాలతో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయి ఏదో రోజు పూర్తిగా కుప్పకూలిపోతాయి.

ఈ అవకాశం అధికారంలో ఉన్న పార్టీలకే ఉంటుంది. కనుక అవి పూనుకొని ముందుగా తమ రాజకీయ వైఖరిని మార్చుకొని నైతిక విలువలకు, ప్రజాస్వామ్య విదానాలకు కట్టుబడి పనిచేయడం మొదలుపెడితే రాజకీయాలు వాటంతట అవే శుభ్రపడతాయి. కానీ ఇటువంటి చిలకపలుకులతో ఏ మార్పు రాదు.