ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులు భూములిచ్చిన తమకు ఆమోదయోగ్యం కాదని అమరావతి రైతులు మూడు వందల రోజుల పాటు ఉద్యమిస్తున్నారు. అయితే ఈ ఉదయమాన్ని కనీసం గుర్తించరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అదే సమయంలో తమ మంత్రులు, నాయకులతో ఉద్యమం చేస్తున్న వారిని తిట్టిస్తారు.
అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఇది కేవలం మీడియా ద్వారా మాత్రమే జరుగుతున్న ఉద్యమని విమర్శించారు. బాగా డబ్బున్న ప్రొడ్యూసర్ తానే ఓ చెత్త సినిమా తీసి, తానే ఆడించుకుని, రికార్డ్ బద్దలు అంటూ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు పాల్గొనే ఉద్యమాలు ఉత్తేజభరితంగా ఉంటాయని, కానీ మీరు చేస్తున్న పనులు.. ‘ఉద్యమం’ అనే మాటకే అవమానం కలిగించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. అయితే ఈ విషయంగా వైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న వేశారు. అలాగే అందులో పాయింట్ ఉన్నట్టే అనిపిస్తుంది.
“రైతులు నిరసన తెలుపుతుంటే సానుభూతి లేకపోగా అవమానిస్తున్నారు. ఉద్యమమే లేకపోతే అసెంబ్లీకి వెళ్లేందుకు సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటున్నారు. ఉద్యమకారులంటే భయంతోనే సచివాలయానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. కొంతమంది సలహాదారుల వల్ల సీఎం జగన్ ఇప్పటికే ఎస్సీ,ఎస్టీలకు దూరమయ్యారు. ఇప్పుడు సజ్జల వంటి సలహాదారుల వల్ల రైతులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. నిజమే అసలు ఉద్యమమే లేకపోతే సెక్యూరిటీ ఎందుకు?