మరాఠీ చిత్ర పరిశ్రమలోనే అతి పెద్ద హిట్ రికార్డు నమోదు చేసిన చిత్రం ‘సైరత్’. ఈ చిత్రంలో ఆర్చీగా అద్భుత నటన కనబర్చిన హీరోయిన్ రింకూ రాజ్ గురు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే… హీరోయిన్ గా నటించిన రింకూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఈ చిత్రం షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమం, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపిన రింకూ మళ్లీ స్కూల్ బాట పట్టింది.
షోలాపూర్ జిల్లాలోని తన స్వగ్రామం అక్లుజ్ లోని పాఠశాలకు వెళ్లింది. ఈ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ నెల 12న స్వగ్రామం చేరుకున్న రింకూకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కాగా, ప్రేమకథతో తెరకెక్కిన ‘సైరత్’ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు. ఇక కలెక్షన్ల విషయాని కొస్తే, ఈ చిత్రం వంద కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.
ఒక్కసారి వెండితెరపై వెలిగిపోయిన తర్వాత మళ్ళీ తమ పూర్వ జీవితాలలోకి వెళ్ళడం చాలా అరుదుగా జరిగే విషయం. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఆఫర్లు, కుప్పలు కుప్పలుగా తెచ్చిపెట్టే డబ్బులు… ఇవన్నీ సక్సెస్ ఉన్న సినీ హీరోయిన్ల కెరీర్ లో భాగం. అయితే అనూహ్యమైన సక్సెస్ చవిచూసిన తర్వాత కూడా రింకూ మళ్ళీ తన గత జీవితం… పుస్తకాలు పట్టుకుని స్కూల్ కు బయలుదేరడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు.