బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో… “భారత్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం. ఎవరో ఒకరు చంపేస్తారు” అని సైఫ్ పేర్కొన్నాడు. దేశంలోని తొలి నెట్ఫ్లిక్స్ షో అయిన ‘సేక్రెడ్ గేమ్స్’ ఈ నెల స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సైఫ్ పోలీసాఫీసర్ సర్తాజ్ సింగ్ పాత్రను పోషించాడు.
‘సేక్రెడ్ గేమ్స్’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో సైఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు వ్యాఖ్యలు చేశాడు. మన కులం కాని వారితో డేటింగ్ చేసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా ఎవరో ఒకరు చంపేయడం ఖాయమని సైఫ్ పేర్కొన్నాడు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
‘సేక్రెడ్ గేమ్స్’పై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మితిమీరిన శృంగారం, హింస, రాయలేని భాషలో పదప్రయోగం వంటివి ఇందులో ఉపయోగించారు. ముఖ్యంగా భారత రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ షోపై కోర్టుకెక్కింది. రాహుల్ గాంధీ ఇటీవల ఓ ట్వీట్ చేస్తూ తన తండ్రి దేశం కోసం పనిచేశారని, సేవ చేస్తూ ప్రాణాలొదిలారని పేర్కొన్నారు.