జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం “జనతా గ్యారేజ్” ఆడియో వేడుక దాదాపుగా నాలుగు గంటల పాటు సాగింది. ఈ ఆడియో వేడుకలో చివరగా ప్రసంగించిన జూనియర్ ఎన్టీఆర్, ‘మీ అనుమతితో నేను ఈ రోజు మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను, అది నన్ను నేను తక్కువ చేసుకోవడమే, అయినా గానీ, మీ అండతో నేను ఎప్పుడు తక్కువ కాను’ అంటూ అభిమానులకు “ఏ సంచలన విషయం చెప్పబోతున్నట్లుగా ప్రసంగం ప్రారంభించారు.
నందమూరి బాలకృష్ణకు – జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న దూరం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ఏదొక రూపేణా హైలైట్ అవుతూనే ఉంది. దీంతో కుటుంబ విషయాలపై అభిమానులకు స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారేమోనని అంతా భావించారు. ఒక రకంగా అభిమానుల్లో కూడా ‘ఏం చెప్తారా’ అని స్తబ్ధత నెలకొంది. కానీ, ఆ తర్వాత తన సినీ ప్రయాణం గురించి క్లుప్తంగా చెప్పిన జూనియర్, తన తాత ఎన్టీఆర్ పేరు, తన తల్లితండ్రులను మాత్రమే స్మరించుకున్నారు.
కనీసం మాట వరుసకు కూడా బాలయ్య పేరు రాకపోవడం ఒక విధంగా నందమూరి అభిమానులను నిరాశ పరిచింది. అయితే 4 గంటల పాటు సాగిన “జనతా గ్యారేజ్” మొత్తం ఆడియో వేడుకనంతా పరిశీలిస్తే… ఒకే ఒక వ్యక్తి మాత్రమే బాలకృష్ణ పేరును స్మరించుకున్నారు. అది డైలాగ్ కింగ్ సాయి కుమార్. నాడు ఎన్టీఆర్ వద్ద ఒక డైలాగ్ చెప్పి ఆరంభించిన సినీ ప్రస్థానాన్ని తలచుకుంటూ, బాలయ్యతో చేసిన ‘రౌడీ ఇనస్పెక్టర్’ సినిమాను గుర్తు చేసుకున్నాడు. సాయి కుమార్ తప్ప మిగతా ఎవ్వరూ బాలయ్య పేరెత్తకపోవడం కేవలం కాకతాళీయం అని భావించాలా? లేక…!?