గతేడాది సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై మెగా హీరో సాయిధర్మ తేజ్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తనను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లిన వ్యక్తికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఆ వ్యక్తి పేరు సయ్యద్ అబ్దుల్ అన్నారు.
సయ్యద్ చేసిన సాయం వల్లనే తానూ ఇప్పుడు ఇంకా ప్రాణాలతో ఉన్నానని., సయ్యద్ అబ్దుల్ సమయానికి స్పందించారని., ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడే సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని అర్ధమవుతుందని భావోద్వేగంగా వీడియో పోస్ట్ చేశారు.
అలాగే సకాలంలో తనకు వైద్యం అందించిన వైద్య సిబ్బందికి సాయితేజ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ప్రార్ధించిన అందరి హీరోల అభిమానులకు., తనను పరామర్శించడానికి వచ్చిన తన తోటి నటీనటులకు., శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురైయ్యారని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్లే తిరిగి ప్రాణాలతో రాగలిగానని., అందరు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ సాయితేజ ప్రజలకు సందేశమిచ్చారు.
మార్చి 28 న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని., తన ఆరోగ్యం కుదుటపడే వరకు వేచి ఉన్న బీవీఎస్ఎన్ ప్రసాద్., సుకుమార్ కు సాయిధరమ్ తేజ్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.