భీమిలి నియోజకవర్గం 1972 లో ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పది సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఆరు సార్లు టిడిపి గెలిచింది. మూడు సార్లు కాంగ్రెస్ నెగ్గింది. ఇక, 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన ప్రస్తుత అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస రావు ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్ది మీద గెలుపొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో అవం తికి ఎంపి సీటు ఇవ్వగా..గంటా శ్రీనివాస రావు భీమిలి నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు. ఈ సీటు నుండి ఈ సారి లోకేష్ పోటీ చేస్తారని గంట ఖాళీ చేసి విశాఖ ఉత్తరానికి వెళ్లారు.
అయితే లోకేష్ పోటీ చెయ్యకుండా అనూహ్యంగా సబ్బం హరిని తెర మీదకు తెచ్చారు చంద్రబాబు. 2014 తరువాత భీమిలిలో అభివృధి బాగా జరిగింది. చాలా ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం అక్కడ ఎదురీదుతోంది అని వార్తలు వస్తున్నాయి. పార్టీ అభ్యర్థి సబ్బం హరి ప్రచారంలోక బాగా వెనుకబడిపోయారని, డబ్బు కూడా ఖర్చు పెట్టడం లేదని సమాచారం. సబ్బం తాను గెలవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.
భీమిలి కనుక చేజారితే ఆ ప్రభావం విశాఖ పార్లమెంట్ మీద పడుతుంది. బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ అక్కడ నుండి పోటీ చేస్తున్నారు. విశాఖలోని పదిహేను నియోజకవర్గాలలో డజన్ సీట్లకు తక్కువ కాకుండా గెలవబోతున్నారని చంద్రబాబు ఆంతరంగిక సర్వేలలో తేలిందని సమాచారం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో కూడా పోటీ ఏకపక్షంగా అయితే మాత్రమే ఉండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు స్థానిక సమస్య బాగా ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం.