నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ సర్కారు లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన పేరిట అవార్డులు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అవార్డులు గెలుచుకున్న వారికి భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగపూర్ లో ప్రధాని మోడీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. లక్కీ గ్రాహక్ యోజన్ కింద అవార్డుకు ఎంపికైన లాతూర్కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని 20 ఏళ్ళ శ్రద్ధ మోహన్ కు మోడీ కోటి రూపాయల బహుమతి అందించారు.
మొబైల్ ఈఎంఐ పేమెంట్ 1,590ను రూపే యాప్ ద్వారా చెల్లింపు జరిపి ఆమె ఈ బహుమతి గెలుచుకుంది. ఇక రెండవ బహుమతి 50 లక్షలను గుజరాత్ కు చెందిన 29 సంవత్సరాల టీచర్ హార్దిక్ కుమార్ అందుకున్నారు. రూపే కార్డు ద్వారా 1110 బిల్లును చెల్లించడంతో లాటరీలో 50 లక్షల రూపాయలు వశమయ్యాయి. అలాగే డిజి ధన్ వ్యాపార యోజన కింద మొదటి బహుమతిగా 50 లక్షలను జీఆర్టీ జ్యువెల్లరీ వ్యాపారి ఆనంద్ అనంత పద్మనాభన్ అందుకున్నారు.
తమిళనాడులోని తాంబరానికి చెందిన ఈ వ్యాపారి, 300 పేమెంట్ను ఆన్ లైన్ ద్వారా స్వీకరించినందుకు గానూ లక్కీ వ్యాపారిగా ఎంపికయ్యారు. ఈ కేటగిరీలో రెండవ బహుమతిని రాగిణి రాజేంద్ర ఉత్తేకర్ అందుకున్నారు. ఆమెకు మోడీ 25 లక్షల రూపాయలు అందించారు. మహారాష్ట్రలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ… కస్టమర్ నుంచి 510 స్వీకరించినందుకు గానూ రెండవ బహుమతిగా ఈమె ఎంపికైంది. బహుమతులు గెలుచుకున్న వారంతా తమకు ‘లాటరీ’ తగిలింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.